మావోలు: ‘హద్దు’ మీరలేరు…వెనక్కి పోలేరు..!
మావోయస్టులకు ‘సరిహద్దే’ శాశ్వత విలాసమా? ఎప్పటి నుంచో మావోయిస్టుల నగానే ‘ ఏవోబీ’ (ఆంధ్ర- ఒడిశా బోర్డర్) దగ్గరే వుంటారన్నది నిలిచిపోయింది. పోలీసులపై మావోయిస్టులు దాడి చేసినా, మావోయిస్టులపై పోలీసులు దాడి చేసినా అంతా ఈ ‘హద్దు‘ వద్దే. అంతే తప్ప దాటి తెలుగు రాష్ర్టాల్లోకి చొరబడిపోతున్నారు. ఈ ఘనత మొత్తాన్ని పోలీసులు తీసుకుంటే పప్పులో కాలేసినట్లే. కాదూ.. ‘ఏరిపారేశాన’ని చెప్పుకున్నవై.యస్.రాజశేఖర రెడ్డిది- అన్నా తప్పున్నర అవుతుంది.
. ముఖ్యమంత్రిగా వైయస్ గద్దెనెక్కాక మావోలను శాంతి చర్చల పేరుతో ఓ వైపు సంప్రదింపులు చేస్తూనే … మరో వైపు వారివారి స్థావరాలు, కదలికలపై తమ పోలీసు యంత్రాంగంతో నిఘా పెట్టారు. అదను చూసి ఎరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మావోలకు ఒక్కసారిగా శరఘాతంగా పరిణమించింది . ఈ ప్రభావంతో ఇతర రాష్ట్రాలకు పోయి తల దాచుకంటూనే ఆయా రాష్ట్రాలలో మావోలకు కేంద్ర నాయకత్వం వహించారు.
అయితే పోలీసులు తమ తమ అధునాతన యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ వారిని నిలువరిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఎన్ని రకాల దాడులకు పాల్పడినా, ఎప్పటికప్పుడు విరుచుకు పడుతూ తమ ఉనికిని చాటుకుంటూనే వస్తున్నారు. ఈ పోరాటంలో మావోలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నా సరే, ఎప్పటికప్పుడు తమ క్యాడర్ను చాప కింద నీరులా నిర్మాణం చేసుకుంటూనే ఉన్నారు.కానీ ఈ నిర్మాణ క్రమం గతంలో లాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా లేదు. ఎంత సేపూ, ఆయుధాలూ, దళాలూ- ఇటువైపే ఆసక్తి చూపటంతో అనుబంధసంఘాల నిర్మాణాన్ని పక్కన పెట్టారు. కానీ ప్రభుత్వాలు వీటిని మొలవకుండా చూస్తూ నిషేధాస్ర్తాలను సంధిస్తూ వచ్చాయి.
ఒకప్పుడు వీరికి ప్రధాన అనుబంద సంస్థలైన కార్మిక,రైతు,విద్యార్థి సంఘాల తో జనం మద్దతు కూడగట్టేవారు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. అందుకే ‘సరిహద్దు’ దగ్గరే ఆగిపోయారు. అలాగని వారిని పోలీసులు కూడా ఆ ‘ సరిహద్దు’ నుంచి వెనక్కినెట్టలేక పోయారు. అఫ్ కోర్స్. ముందుకు కూడా రానివ్వలేదనుకోండి.అది వేరే విషయం.