చైనాపై ’నిషేధాస్త్ర‘మే పరిష్కారమా..?
“దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ !” -గురుజాడ.
ప్రజాకవి గురుజాడ ‘జాడ’ను మన పాలకులు మరచినట్టున్నారు. గతంలో జరిగిన కొన్ని ఊదంతాలు చూస్తే, అర్థమవుతుంది మన పాలకుల తీరు. ప్రజలను మరచి ఒక ప్రాంతాన్నిదేశభక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం టెక్నాలజీని చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో జరిగిన భారత్- చైనా ఘర్షణ తర్వాత భారత ప్రభుత్వం 60 చైనీస్ ‘అప్’లను నిషేధించిన విషయం తెలిసిందే.
మన దేశ పారిశ్రామిక రంగంలో చూసుకున్నట్లయితే, మొబైల్ రంగంలో 66% కి పైగా చైనా కంపెనీలే ఆధిపత్యాన్ని చేలాయిస్తున్నాయి . ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం అత్యధికంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. మరీ, ముఖ్యంగా వైద్య రంగంలో ఫార్మసీ ముడి పదార్థాల కోసం 2/3 వ వంతు చైనా మీదనే ఆధారపడి వున్నాము. వీటన్నింటిపై ఆధారపడుతున్న క్రమంలో కేవలం అప్ లను నిషేదించడమనేది తాత్కలిక ఉపశమనేమేనని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం దేశంలోని ఏ ఇంటిలోకి ప్రవేశించినా ఖచ్ఛితంగా చైనా వస్తువులు ఉన్నటువంటి స్థితిని గమనించవచ్చు. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రధానమైనదిగా చెప్పే కారణం, చైనా వస్తువులు తక్కువ ధరలకు లభించటంతో పాటు, ఆకర్షణకు గురి చేయడమేనని అంటున్నారు. సోషల్ మీడియాలో చైనా వస్తువుల దిగుమతిని కూడ నిషేధించాలని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధిస్తే, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. ప్రభుత్వం నిజంగానే ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరిస్తే, ఏటువంటి ప్రత్యామ్నయాలను చూపిస్తుందనే సందేహలు ఉత్పన్నమవుతున్నాయి. అయా కంపేనీలలో ఎంతోమంది యువత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధిని పొందుతున్నారు. ఇప్పటికే నిషేధించిన అప్ లకు సంబంధించిన కంపేనీలలో యువత ఉన్నటుండి నిరుద్యోగులుగా మారినటువంటి సందర్భాలు గమనించవచ్చు. ఇప్పటి వరకు వారికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపించలేదు. కాబట్టి, నిరుద్యోగులుగా వదిలివేయకుండా వారికోసం ఏవైనా మార్గదర్శకాలు రూపోందిస్తారా..? లేక ఎప్పటిలానే వదిలేస్తారా..? అనే ప్రశ్నలు సగటు యువతకు తలెత్తుతున్నాయి.
బొగ్గు గనులు మొదలుకొని అంతరిక్ష ప్రయోగాల వరకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి ప్రభుత్వాలు. దేశీయంగా కనీస అవసరాల నుంచి అంతరీక్ష ప్రయోగాల వరకు అవసరమయ్యే ప్రతి వస్తువుని ఉత్పత్తి చేసే విధంగా అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పటికైనా యువ, నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ప్రచారం జరుగుతుంది. దేశీయంగా ఇతర దేశాల వస్తువులకు ధీటుగా నాణ్యతలో రాజీపడకుండా తక్కువ ధరలకు ప్రజలకి అందుబాటులో ఉంచేలా ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించాలని యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ‘అప్’ ల నిషేధానికే పరిమితమవుతుందా..? లేదా వస్తువుల దిగుమతిని కూడా నిషేధిస్తారా..?
అంతిమంగా ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం ‘నిషేధాస్త్ర’మేనా..?
-బి.శ్రీదర్, విద్యార్థి
